210 కేజ్రీవాల్ పతనము మరియు నా అంతరంగ మథనము.
చర్చనీయాంశాలు: అరవింద్ కేజ్రీవాల్, నరేంద్రమోడీ, Arvind Kejriwal, Varanasi, మతతత్వము
భారత్ లో లౌకికవాదానికి చావుదెబ్బ గాంధీ గారి కాలంలో నే తగిలింది. ఆయన స్వాతంత్ర్యోద్యమానికి ముస్లిం పెద్దల మద్దతు కూడగట్టుకోటానికి ఖిలాఫత్ ఉద్యమాన్ని బలపరచమని ప్రజలను కోరారు. ఖలీఫా అనే ఆయన టర్కీ దేశానికి అనువంశిక సుల్తాను లేక చక్రవర్తి. మొదటి ప్రపంచ యుధ్ధానంతరం, బ్రిటీష్ వారు ఖలీఫాగారి అధికారానికి ఎసరు పెట్టారు. దానికి వ్యతరేకంగా ఇస్లామిక్ ప్రపంచంలో ఖిలాఫత్ ఉద్యమం రేగింది. భారతీయులలో తురుష్కముస్లిములకు ఖలీఫా యందు భక్తి ఉండటాన వారు కూడ ఖిలాఫత్ ఉద్యమంలో చేరారు. గాంధీగారు అనుకున్నదేమిటంటే ఖిలాఫత్ కు భారతీయులు మద్దతిస్తే భారతీయ ముస్లింలు భారత స్వాతంత్ర్యోద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటారని. అలా జరిగిందా, లేదా, అనటానికి చరిత్రలో సరియైన లెక్కలులేవు.
ప్రజలు మతం కోణంలో ఆలోచించటానికి పునాది గట్టిపడింది అని మటుకు చెప్పచ్చు.
నా దృష్టిలో హిందూమత తత్వం గట్టిపడటానికి కూడ , ఇది అవకాశం ఇచ్చింది.
స్వాతంత్ర్యానంతరం కూడ కాంగ్రెస్ , ఆతరువాత ఏర్పడ్డ పలు పార్టీలు మైనారిటీల రక్షణ నెపంతో ప్రజలను విభజించి పాలించటం మొదలుపెట్టారు.
ఫలితంగా హిందూమత వాద పార్టీలకుకూడ హిందువులు మద్దతివ్వటం ఎక్కువయింది.
2014 ఎన్నికలలో సోనియా గాంధీగారు ఢిల్లీ ఇమాం బుఖారీ గారిని కలిసి వోట్లు యాచించటాన్ని మనం తప్పు పట్టుకున్నాం.
ఇదే పధ్ధతిలో మోడీ గారు హిందూ సన్యాసులను ఆశ్రయించి వోట్లు అడుక్కోటాన్ని తప్పు పట్టుకున్నాం.
ఇపుడు అరవింద్ కెజ్రీవాల్ గారు చేసింది ఏమిటి? కోడలుకి బుధ్ధి చెప్పి అత్త తెడ్డునాకినట్లయింది.
కెజ్రీవాల్ గారు వారణాసిలో నామినేషన్ వేయటానికి అడుగుబెట్టగానే చేసిందేమిటి? బెనారస్ శహర్ ఈ కాజీ (బెనారస్ పట్టణానికి ముస్లిం మత న్యాయమూర్తి వంటివాడు) ఘులాం నశీర్ గారిని కలిసి ఆయన మద్దతును అడుక్కున్నారు. నసీర్ గారు కేజ్రీవాల్ గారి విజయానికి ప్రార్ధనలు చేస్తానని వాగ్దానం చేశారుట.
నా దృష్టిలో కెజ్రీవాల్ గారు చేసినది చాల చెత్త పని. ముస్లిం వోట్లకోసం బిచ్చమెత్తటం అంటే ప్రజలను మతపరంగా విడగొట్టినట్లే. అపుడు, మోడీగారు హిందూ వోట్లకోసం బిచ్చమెత్తటాన్ని తప్పు పట్టలేం.
ప్రజలంతా మతం ప్రాతిపదికగా వోట్లు వేయటం మొదలు పెట్తే, మోడీ విజయం తథ్యమవుతుంది.
శ్రీ కేజ్రీవాల్ గారి పధ్ధతి వొళ్ళో పెడుదునా , దళ్ళో పెడుదునా అన్నట్లుగా ఉన్నది. మోడీ పరిస్థితికి ఏవిధంగానూ తీసిపోటంలేదు. ఇరువురూ కామాతురాణాం న భయం న లజ్జా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
శ్రీకేజ్రీవాల్ పతనం, భారత ప్రజలను తీవ్రనిరాశకు గురి చేస్తుంది. ఆటో డ్రైవర్లు, మొ|| నిమ్న వర్గాలవారు కెజ్రీవాల్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఏదో విధంగా మోడీని ఓడించి గయంట్ కిల్లర్ గా నమోదు కావాలనే దురాశ వల్ల కేజ్రీవాల్ సిధ్ధాంతాలు లేని ఒక అవకాశవాదిగా, చౌకబారు రాజకీయనేతగా దిగజారిపోతున్నాడు.
కేజ్రీవాల్ సిధ్ధాంతాలకు కట్టుబడి ఉంటే, ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లుగా ఆయన ప్రారంభించిన ఉద్యమం చిరకాలం నిలుస్తుంది. ఆయన ప్రధాన మంత్రికాక పోయినా, ఒక సజీవమైన ఉద్యమం జాతికి స్ఫూర్తిదాయకంగా నిల్చేది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.