252 చంద్రబాబు నాయుడు గారు తన గత తప్పులను తిరిగి తిరిగి చేస్తున్నారు.
చర్చనీయాంశాలు- 252, చంద్రబాబు, రాజధాని, అభివృధ్ధి, విభజన
వ్యక్తులుగానీ, పాలకులు గానీ, సమాజాలు కానీ తప్పులు చేయవచ్చు, వాటికి పశ్చాత్తాప పడవచ్చు, తమ తప్పులను దిద్దుకోవచ్చు.
తాము తప్పులు చేసేదాకా వేచి యుండి, వాటినుండి నేర్చుకునే కన్నా , ఇతరులను గమనించి, వారు అప్పటికే చేసిన తప్పులనుండి నేర్చుకోటం, మనకి ఎక్కువ మేలు చేస్తుంది.
ఉదాహరణ
గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలుగు దేశం ప్రభుత్వాలూ, కేంద్రం ఇచ్చిన నిధులను, రాష్ట్రప్రభుత్వ 23 జిల్లాల నిధులను, తీసుకెళ్ళి హైదరాబాదు నగరంలో కుమ్మరించారు. ఆతరువాత కెసీఆర్ వచ్చి అన్నీ మావే అన్నాడు. బిజేపీ, సోనియా గాంధీ అందరూ కుమ్మక్కయ్యి ఆంధ్ర ప్రదేశ్ ను అన్యాయమైన విభజనకు గురిచేశారు.సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో, చంద్రబాబుతో సహా, అన్ని పార్టీల నేతలూ, మరల ఈ తప్పును చేయమన్నారు. మొత్తం నిధులను రాజధానిపై ఖర్చుచేయమన్నారు.
చంద్రబాబునాయుడు గారికి విజయం తలకెక్కాక బుధ్ధి మారిపోయినట్లుంది. ఆయనకు, ఆయన బంధువులకు, సహనేతలకు, ఏమి బినామీ ఆస్తులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయో కానీ, విజయవాడ, గుంటూరు మధ్యలోనే రాజధాని అంటున్నారు. పది సంవత్సరాలకాలంలో రాజధాని అభివృధ్ధి కోసం నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు.
భూసేకరణ కోసం ఊగిపోతున్నారు. సేకరణ చేసిన భూముల్లోనే రైతులకు వాటాలిస్తానంటున్నారు. వాటి ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయి రైతులు లాభపడతారంటున్నారు.
విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి పరిధిలో జరిగిన రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ లు, వ్యాపారాలపై సీబీఐ దర్యాప్తు చేయించటం పోయి ఆయనే అగ్నికి ఆజ్యం పోయటం దురదృష్టకరం.
కొత్తరాష్ట్రంలో కొత్తజిల్లాలు
కృష్ణా జిల్లా, తూగో జిల్లా, కర్నూలు, అనంతపురం, వంటి జిల్లాలను విభజించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించవలసిన అవసరం ఉంది.విభజించాక ఇరవయి నుండి ఇరవయిమూడు జిల్లాలు వస్తాయి. ఒక్కో జిల్లాకు ఒక్కో రాష్ట్రస్థాయి కార్యాలయం ఏర్పాటు చేయవచ్చు. అత్యధిక ప్రజలకు నిత్యం పని ఉండని గనులశాఖలను మూలన ఉన్నా సరిహద్దు జిల్లాలలోనూ, అత్యధిక పేద ప్రజలు రాజధానికి తిరగాల్సిన శాఖలను భౌగోళిక కేంద్ర ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అధికార వికేంద్రీకరణ తేలిక అవుతుంది.
మూతబడిన (లేక మూతబడటానికి సిధ్ధంగా ఉన్న ) ఇంజనీరింగు లేక డిగ్రీ కాలేజీ భవనాలు
మూతబడిన (లేక మూతబడటానికి సిధ్ధంగా ఉన్న ) ఇంజనీరింగు లేక డిగ్రీ కాలేజీ భవనాలను ప్రతిజిల్లాలోనూ ఒక కాంప్లెక్సును టెండరులు లేక వేలం ద్వారా న్యాయమైన ధరకు కొనవచ్చు. వాటికి ఉండే ఆడిటోరియాలను, హాస్టళ్ళను రకరకాల పధ్ధతులలో వాడుకో వచ్చు. నాలుగు లక్షల కోట్లు ఎందుకో. విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరిలలో రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్లకు చావు దెబ్బ కొట్టచ్చు.