చర్చనీయాంశాలు: సీపీఐ, సీపీఎమ్, వామపక్షాలు, ఖమ్మం, వైద్యవిద్య, మద్యం
పోస్టునంబరు 168, మార్చి ౪, 2౦14 నాడు వ్రాసింది ౧౬౯ చూడండి.
ఊహించినట్లే అయ్యింది. 168లో వామపక్షాల నేతలు ప్రైవేటు వైద్యకళాశాలలను నడపటం గురించి వ్రాశాను.
ఇపుడు పత్రికలలో వచ్చిన వార్తలను బట్టి శ్రీకమ్యూనిస్టునేత గారు నడుపుతున్న వైద్య కళాశాలలో మద్యం సీసాలను, క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఇవి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి తరఫున పంచి పెట్టేందుకు సిధ్ధం చేసుకున్నవని అర్ధం అవుతున్నది. ఈకాంగ్రెస్ నేతగారు శ్రీ కమ్యూనిస్టునేత గారి పుత్రరత్నం కదా. సిపిఐకి చెందిన జితేందర్ రెడ్డి అనేవారు ఆ రోడ్డులోనే నగదు పంచుతుండగా చిక్కారు, అని ఆంధ్రజ్యోతి లో వచ్చింది.
సీపీఐ కాంగ్రెస్ తో సంధిచేసుకోగా, సీపీఎమ్ తెరాసతోనూ, వైఎస్ఆర్పీ తోనూ సంధి చేసుకోటం తెలంగాణలో జరిగిన విచిత్రం.
ఎవరికైనా బూర్జువా పార్టీలుగా మారే హక్కు, బూర్జువాలు లాగా ప్రవర్తించే హక్కు ఉంటుంది. కమ్యూనిస్టులు అనే లేబుల్, వామపక్షాలు అనే లేబుల్ తగిలించుకొని బూర్జువాలలాగా ప్రవర్తించే కన్నా పార్టీపేరునే మార్చుకోటం మేలుగా ఉంటుందేమో.
నాకు ఖమ్మం నగరం పై ప్రత్యేక అభిమానం ఉంది. 1975 లో నా వివాహం ఖమ్మం పట్టణంలో జరిగింది. ఆతరువాత ఖమ్మం పట్టణాన్ని దర్శించే భాగ్యం 2014 దాకా దొరకలేదు. ఒక బంధువు ఖమ్మంలో ఉన్న వైద్యకళాశాల హాస్పిటల్ లో ఉంటే పరామర్శించటానికి వెళ్ళవలసి వచ్చింది. ఖమ్మంలో జరిగిన అభివృధ్ధి నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కానీ ఇడ్లీ, మొ|| తినుబండారాల ధరలే నాకు కళ్ళనీళ్ళు తెప్పించాయి. వైద్యకళాశాలకు అనుబంధంగా ఉన్న ఆహాస్పిటల్ రిసెప్షన్ హాల్లోకి ప్రవేశించగానే మొదట కనిపించింది శ్రీకమ్యూనిస్టునేతగారి పెద్ద రంగుల ఫొటోనే. స్ఫూర్తిదాత మొ|| పదాలతో సుందరంగా వర్ణించారు. ఆయన ఆకళాశాలకి, ఆవైద్యశాలకి చాలా సహాయం చేశారు కాబోలు, అందుకే కృతజ్ఞతతో ఆఫొటో పెట్టారు కాబోలు అనుకున్నాను. ఎంత బాధ్యతాయుతమైన ప్రతినిథియో కదా అనుకున్నాను. కానీ నా గాడిద బుధ్ధి స్కెప్టిసిజానికి, సినిసిజానికీ అలవాటు పడటాన, మనసు కొంత ఆందోళితంగా ఉండగానే, తిరుగు ప్రయాణానికి రైలెక్కాను.
రైల్లో ఒక పిజి వైద్యవిద్యార్ధితో యాదృఛ్ఛికంగా వైద్యవిద్య, నేటి వ్యాపారంగా మారిన వైద్యం గురించి మాట్లాడటం జరిగింది. అతడు తాను ఖమ్మం నేటివ్ నని చెప్పాడు. అక్కడే వైద్య విద్య నభ్యసించానని చెప్పాడు. నేను ఉండబట్టలేక అక్కడ రిసెప్షనలో చూసిన శ్రీకమ్యూనిస్టునేత ఫొటోగురించి చెప్పి ఎంత గొప్ప సేవచేసారో కదా, ఆవైద్యకళాశాల వారు శ్రీకమ్యూనిస్టునేతగారి ఫొటో పెట్టారు, అన్నాను.
అతడాశ్చర్యపోయి, ఫొటో ఎందుకుండదు, ఆకాలేజీ , ఆహాస్పిటల్, ఆయనవే అన్నాడు.
ఆయనవే అంటే ఆయన స్వంత ఆస్తా అని నేను అడిగాను. అతడు తలఊపాడు.
శ్రీకమ్యూనిస్టునేతగారి సంగతి అలా వదిలేద్దాం.
రాష్ట్రంలో ఎక్కడ చూచినా ఇంజనీరింగు కళాశాలలు, వైద్యకళాశాలలు, బియీడీ కళాశాలలు, పాలీటెక్నిక్కులు, మొ|| సర్వ విధ విద్యాసంస్థలు ఫీజు రీయింబర్సుమెంటులతో వ్యాపారం చేసుకుంటూ లక్షలు లేక కోట్లు గడిస్తున్నాయి. వీటికి బహుశా ఆదాయపన్ను మినహాయింపు ఉండి ఉంటుంది. ఎందుకంటే వీటిని సొసైటీల చట్టం 1860 క్రింద రిజిష్టర్ చేయటం, లేక ట్రస్టుల చట్టం క్రింద రిజిస్టర్ చేయటం జరుగుతుంది. పార్ట్నర్ షిప్ లు , లిమిటెడ్ కంపెనీలు చాలా అరుదు. అలాంటప్పుడు స్వంతం అనే ప్రసక్తి ఉండకూడదు.
శ్రీ నారాయణ, శ్రీసురవరం ల రాజ్యం వచ్చాక సీపీఐ నైతిక పతనం ఎక్కువైనట్లుగా కనిపిస్తుంది.
గతంలో సిపిఐ నేతలు, సిపిఎమ్ నేతలు పార్టీలు మారటం అనేది చాల అరుదుగా జరిగేది. అసంతృప్తిచెందిన సీపీఐ, సీపీఎమ్ నేతలు క్రొత్త కమ్యూనిస్టు పార్టీలను స్థాపించుకునేవాళ్ళు తప్ప బూర్జువా పార్టీలలో చేరే వాళ్ళుకాదు. ఇపుడు నాగార్జునసాగర్ నుండి పోటీచేస్తున్న తెరాస అభ్యర్ధి శ్రీ ఎం. నరసింహయ్య గతంలో సిపిఎం ఎం.ఎల్.ఏ అని తెలిసినపుడు వామపక్షాభిమానులు తప్త మనస్కులు కాకతప్పదు.
ఇంకా ఉంది, దీనిని కూడ తిరగవ్రాయాల్సిఉంది. ఇంకో సారి వ్రాస్తాను.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.