మనలో పాపం చేయని వాడూ!!
రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, లోక్ సభ సభాపతులు, ప్రధాన న్యాయమూర్తులు, సాధారణ వ్యక్తుల కన్నా ఉన్నతంగా ఉండాలి.
Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश, اجینڈا: నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మూలాయం సింగ్ యాదవ్
ఈ దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉన్నది. పోలింగు కేంద్రాల వద్ద వోట్లు వేయటానికి క్యూలలో నిల్చొని, తమ గుర్తింపు కార్డులను మీడియాకు చూపిస్తూ ఉన్న వారిని , వోట్లువేసి ఇంకు పూసిన తమ చూపుడు వేళ్ళను మీడియాకు చూపిస్తూ ఉన్న వారిని , గమనిస్తే ఏమి అర్ధం అవుతున్నది?
లోక్ సభకు వోటు వేయటానికి, శాసనసభకి వోటు వేయటానికి, కార్పోరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ మెంబర్లను ఎన్నుకోటానికి వోటు వేయటానికి కావలసిన పరిణతి, నైపుణ్యాలు, సమాచార జ్ఞానం, మొ|| వాటిలో చాల తేడా ఉంది. లోక్ సభ సభ్యుడి విధులేమిటో చాల మంది వోటర్లకి తెలియదు. అభ్యర్ధులకు, ఎన్నికైన సభ్యులకు, కూడ చాలమందికి తెలియదు. భారత్ ఎదుర్కుంటున్న ఆర్ధిక సమస్యలు చాల సంక్లిష్టమైనవి. అంతర్జాతీయ వాణిజ్యం, దౌత్య సంబంధాలు, న్యాయ వ్యవహారాలు, సాంకేతిక వ్యవహారాలు చాల సంక్లిష్టంగా మారాయి. చాల వ్యవహారాలు డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళకే అర్ధం కాని స్థితికి చేరుకున్నాయి.
ప్రభుత్వంలో ఒక చప్రాసీ పని చేయటానికి, రైల్వేలో గాంగమాన్, కీమాన్ పనులు చేయటానికి కూడ రకరకాల పరీక్షలు ఉంటాయి. కానీ వోటు వేయటానికి గానీ, వేయించకుని పెద్ద పెద్ద పదవులు అలంకరించటానికి గానీ, ఎటువంటి పరీక్షలు ఉండక పోటం ఆశ్చర్యకరం.
దేశానికి లక్షల కోట్ల రూపాయల నిథులు ఉంటాయి. అవి కాక ఇంకా కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తెస్తూ ఉంటారు. కొన్ని లక్షల కోట్లరూపాయల ఆయుధాలు , విమానాలు కొంటూ ఉంటారు. ఈ నిథులన్నిటినీ కాపాడటానికి, సమర్ధవంతంగా వినియోగించటానికి, ఎంత సమర్ధత, విశ్వసనీయత కావాలి? నేరగాళ్ళను, చదవకపోయినా డిగ్రీలను కొనుక్కున్న వాళ్ళని ప్రతినిథులుగా పాలకులుగా ఎన్నుకుంటే, వారు ప్రజలను నట్టేటిలో ముంచక మానరు.
చాల మంది వోటర్లకి ఈ బలిపీఠం పై ఎన్ని లక్షల కోట్లు నైవేద్యం పెట్తున్నారో తెలీదు, తెలుసునే ఆసక్తి లేదు, ఉన్నా సమయం, శక్తి, యుక్తి, నైపుణ్యం, శారీరిక ధార్ఢ్యం లేవు. వాళ్ళు లోక్ సభ ఎన్నికలలో మా సారా సీసా మాకు పారేసి, నీకు నచ్చినట్లేడువు, అని వోట్లేసినట్లవుతుంది.
కాబట్టి పాలకుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోటం ప్రజలకు ఎంతో అవసరం. పారదర్శకంగా జీవించటానికి ఇష్టం లేని నేతలు, ప్రజలను పాలించటానికి ముందుకు రాకపోటమే మంచిది. అయితే పదవులని ఆశించని వారిని ప్రజలు శాసించలేరు.
శ్రీ నరేంద్ర మోడీ గారు ఇన్నాళ్ళ బట్టీ గోప్యంగా ఉంచిన తన వివాహ సమాచారాన్ని, 2014 అఫిడవిట్ లో బయట పెట్టటం ముదావహం. ఇదే పధ్ధతిలో, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీ కేజ్రీవాల్ గారు, శ్రీ మూలాయం సింగ్ యాదవ్ గారు, ఇంకా ప్రధాని అవ్వాలని కోరుకునే ఇతరులు, తాము దాస్తున్నవి ఏమైనా ఉంటే బయట పెడితే , వారి వ్యక్తిత్వాలు శోభిస్తాయి.
ఇక్కడ ఒక ముఖ్యవిషయం మనం మరువరాదు. ఎవరో ఒక పౌరుడు ఏదో అన్నాడని, నిండు చూలాలైన భార్యను అడవులలో దించటం వంటి ''అతి'' ధర్మాలను పాలకులు చూపనక్కర లేదు. అలాగని ఈ ధర్మాలు ఇతరుల భార్యలను (లేక భర్తలను) కాజేయటానికి, మభ్యపెట్టి కొట్టేయటానికి దారి తీయకూడదు. కొందరు ముఖ్యమంత్రులు ఆపనులు కూడ చేశారు.
పాలకులకు, సామాన్యపౌరులకి తేడా ఏమిటంటే, పాలకులు వివేకులక్రింద లెక్క. సామాన్య పౌరుడు పెళ్ళాన్ని వేధించటం, వాడి సహజ గుణాలలో ఒకటిగా ఉండ వచ్చు. పాలకుడికి పౌరుల పెళ్ళాలను వేధించటం గాని, తన పెళ్ళాన్ని వేధించటం కానీ ఒక గుణంగా ఉండ రాదు. అయితే అత్యంత ప్రత్యేక పరిస్థితులు వచ్చినపుడు భార్యా భర్తలు విడిగా ఉండటం తప్పు అవదు. కానీ ఏది జరిగినా పారదర్శకంగా జరగాల్సి ఉంటుంది.
వేధింపబడుతున్న భార్యనుండి అభ్యంతరాలు లేవు కదా
వేధింపబడుతున్న భార్యనుండి అభ్యంతరాలు లేవు కదా అనే మాట నిలవదు. ఉదాహరణకి అర్జునుడు సుభద్రను ద్వారక నుండి కిడ్నాప్ చేసి తీసుకు వచ్చినపుడు, ద్రౌపది ఏడ్చింది. సత్యభామను తెచ్చినపుడు రుక్మిణి, జాంబవతిని తెచ్చినపుడు రుక్మిణి, సత్యభామలు ఏడ్వరా? వారిని, శ్రీకృష్ణుడు, అర్జునుడు , కుంతి సముదాయించారనుకోండి, తరువాత వారు కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది కానీ, అది హృదయపూర్వకంగా జరిగిందా అనేది ప్రశ్నార్ధకమే. అభ్యంతరాలు రాకపోటానికి వివిధ కారణాలు ఉండ వచ్చు. వారిపై నిఘా ఉండవచ్చు. అక్బర్ జనానాలో 5000 మంది దాకా భార్యలు ఉండే వాళ్ళు. వాళ్లకి నపుంసకుల కాపలా ఉండేది. చీమ చిటుక్కుమన్నా పాదుషాకి వార్త చేరుతుంది. ఇంక వాళ్ళేమి అభ్యంతరాలను లేవదీస్తారు?సెలబ్రీటీలనుండి విడాకులు తీసుకన్న భార్యలుగా జీవించే కన్నా, వారి పెద్దభార్యలుగా జీవించటమే మెరుగని, ఆవిధంగా వేలకోట్లకి తాము, తమ పిల్లలు వారసులు కావచ్చని, కొందరు స్త్రీలైనా అనుకోవచ్చు. కానీ ఆపధ్ధతి సమాజానికి తీరని అపకారం చేస్తుంది. ఆ పధ్ధతి పెట్టుబడి దారీ విధానం లక్షణం.
పాలకులు, తమ వ్యక్తిగత విషయాలలో స్వాతంత్ర్యాలకు అర్హులే. ఇద్దరు మాజీ భర్తలను కలిగిని వాలెస్ అనే మహిళను వివాహం చేసుకోటంపై వివాదం చెలరేగినపుడు ఎడ్వర్డ్ 8 రాజు, తన రాజ్యాన్నే వదిలేసి (abdication), తన ప్రేమకే ప్రథమ స్థానం ఇచ్చుకున్నాడు. ప్రేమకు, కర్తవ్యానికి మధ్య సంఘర్షణ వచ్చినపుడు ఏమి జరుగుతుందో స్వర్గీయ కల్లూరి చంద్రమౌళి గారు (మాజీ దేవాదాయ మంత్రి) తన రామాయణ సుధాలహరి అనే గ్రంథంలో సువివరంగా చర్చించారు.
అయితే అద్దాల గదులలో ఉండే నేతలు, తాము పోటీపడుతున్న నేతలపై రాళ్ళు విసరటంలో కొంత ప్రమాదం ఉంది. శ్రీ రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి వివాహ ప్రకటన అఫిడవిట్ ను ప్రశ్నించటం ఈ తరహాకి చెంద వచ్చు.
ఈ సందర్భంగా బిజెపి నేతలు శ్రీ వెంకయ్యనాయుడు గారు, శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు అన్నట్లుగా చెప్ప బడుతున్న విషయాలను పరిశీలిద్దాం.
శ్రీ వెంకయ్య నాయుడు :
"It will cost Congress heavily. Don't get into this, it will boomerang you,"
తెలుగు సారం: అది కాంగ్రెసుకి చాల భారీ కాస్ట్ ను కలగిస్తుంది. దీనిలోకి వెళ్ళకండి. అది మీపైనే బూమరాంగ్ అవుతుంది.
అది అంటే, వ్యక్తిగత విషయాలను లేవనెత్తటం. వ్యక్తిగత విషయాలను లేవనెత్తితే మీకే నష్టం అని శ్రీ వెంకయ్య నాయుడు గారు హెచ్చరిస్తున్నారు.
శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు అన్నట్లుగా చెప్ప బడుతున్నది:
There are several family issues of the Nehru-Gandhi family that we are aware of. Some of it is also recorded in documents...But we will not discuss it in public because we have a standard..
తెలుగు సారం: నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ఎన్నో కుటుంబ విషయాలు మా కు తెలిసినవి ఉన్నాయి. వాటిలో కొన్ని డాక్యుమెంట్లలో రికార్డ్ అయి ఉన్నాయి. కానీ మేము దానిని పబ్లిక్ లో చర్చించము, ఎందుకంటే మాకు ఒక ప్రమాణం ఉన్నది.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
మాకు చాల విషయాలు తెలుసు, కానీ చెప్పం, అనటాన్ని ఒక తరహా బ్లాక్ మెయిలింగ్ అనాల్సి వస్తుంది. తమకు తెలిసిన , ముఖ్యంగా ఋజువులున్న సమాచారాన్ని , ప్రజా ప్రాముఖ్యం ఉన్నప్పుడు జనానికి విడుదల చేయవలసిన బాధ్యతను విస్మరించటమే కాకుండా, ''బయటకు చెప్తే మీమీదే బూమరాంగ్ అవుతుంది'' అనటం , బయట పెట్టటం కన్నా అల్పమైనది, గుణ హీనమైనది.ఇంకో విధంగా ఆలోచించాలంటే, కాంగ్రెసూ, బిజెపీ కుమ్మక్కై ప్రజలకు సత్యం తెలియకుండా అడ్డు పడుతున్నట్లవుతుంది.
గతంలో శ్రీ రాజశేఖర రెడ్డి గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడ ఇటువంటి ఆటనే ఆడారు. ఒకరిపై మరొకరు తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. కానీ, ఇద్దరిలో ఒకరు కూడ అవినీతిని సరిదిద్దటానికి చట్టబధ్ధమైన చర్యలు తీసుకోలేదు.
ఈనాటి పద్యం
ఆటవెలది, ఛందస్సు. దీనిలో ౧,౩ పాదాలలో ౩ సూర్యగణాలు, ౨ఇంద్రగణాలు ఉంటాయి. ౨,౪ పాదాలలో ఐదూ సూర్యగణాలే ఉంటాయి. ప్రాస ఉండదు. ౪వ గణం మొదటి అక్షరం యతి. వేమన పద్యాలలో చాల భాగం ఆటవెలదులే.తప్పులెన్నువారు తండోప తండంబులు
ఉర్విజనుల కెల్ల నుండు తప్పు
తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ.
ఈనాటి పాట
ఎన్ టీ ఆర్ నటించిన , నేరం నాది కాదు ఆకలిది చిత్రం నుండి.
సంగీతం: సత్యం
రచన: డా. సి. నారాయణ రెడ్డి
పాడింది: ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం
పల్లవి:
మంచిని సమాధి చేస్తారా..
ఇది మనుషులు చేసే పని యేనా..
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..
మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా..
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..
చరణం 1:
కత్తితో చేధించనిది కరుణతో చేధించాలి.
కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి..
తెలిసీ తెలీయక కాలు జారితే..తెలిసీ||
చేయూతనిచ్చి నిలపాలీ
మనలో కాలు జారని వారు.. ఎవరో చెప్పండి..
లోపాలు లేని వారు.... ఎవరో చూపండి...
మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా...
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..
చరణం 2:
గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు...
ముసుగులో మోసాలు చేసే మహా వ్యక్తులు కొందరు..
ఆకలి తీరక నేరం చేసే.. ఆకలి తీరక||
అభాగ్యజీవులు కొందరూ
మనలో నేరం చేయని వాడూ.... ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు... ఎవడో చూపండి..
మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా...
మనలో పాపం||
చరణం 3:
తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి..
మరపురాని గుణపాఠం పదిమందిలో నేర్పించాలి..
ఐతే..
ఎన్నడు పాపం చేయని వాడు...
ఎన్నడు పాపం చేయని వాడు... ముందుగ రాయి విసరాలి...
మీలో పాపం చేయని వాడే... ఆ రాయి విసరాలి..
ఏ లోపం లేని వాడే... ఆ శిక్ష విధించాలి..
మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా..
మనలో పాపం||
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.