దేశ ప్రజలను హిందూత్వ పేరుతో విడగొట్టటానికి ప్రయత్నించిన ఖ్యాతి బిజేపిది. దేశప్రజలను మైనారిటీ రక్షణ పేరుతో విడగొట్టిన ఖ్యాతి కాంగ్రెస్ మొదలగు కుహనా సెక్యులర్ పార్టీలది. వీరందరూ ఎంపీలుగా నిలబెట్టిన అభ్యర్ధులలో అధిక సంఖ్యాకులు నేరచరిత్రులు, కోటీశ్వరులు. కోబ్రాపోస్ట్ అనే వార్తా సంస్థవారు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో 11మంది ఎంపీలు సిఫార్సు ఉత్తారాలు ఇవ్వటానికీ, పైరవీలు చేయటానికి రూ. 50000 నుండి రూ. 5౦ లక్షలవరకూ లంచం డిమాండుచేసి దొరికిపోయారు. ఇందులో బిజెపికి చెందిన ముగ్గురు, కాంగ్రెస్ కు చెందిన ఇద్దరితో సహా అన్న పార్టీలవారూ ఉన్నారు. ఆరుగురు ఎంపీలు ఎంతో కొంత తీసుకుని సిఫార్సు లేఖలు ఇచ్చేశారు కూడాను.
స్టింగ్ ఆపరేషన్లలో ఎంపీలు చిక్కటం ఇదే మొదటిసారి కాదు, చివరిసారీ బోకాదు. ఏపార్టీ అగ్రనేతలు కూడాను తమ పార్టీ ఎంపీల అవనీతిని సీరియస్ గా తీసుకున్నట్లు కనబడదు. ఎందుకంటి, వారంతా 2014 ఎన్నికలకు పార్టీ కేంద్రనాయకత్వానికి నిధులు, విరాళాలు, పోగుచేసి ఇస్తేనే వారికి టిక్కెట్లు లభిస్తాయి. దీనిని డబ్బు ఇచ్చి టిక్కెట్ కొనుక్కోటం అన్నా అనకపోయినా క్యాష్ ఈజ్ రియల్. ఈనగ్న సత్యాన్ని మనం ఆది శంకరాచార్యుల జీవితంలోని 'గజం మిథ్య పలాయనం మిథ్య కథతో పోల్చ వచ్చు' . 'అన్నమైతే నేమిరా, సున్నమైతేనేమిరా అంటూ , ఈపాడు పొట్టకు అన్నమే వేద్దామురా ' అనే పాటలోని సారాన్ని మన ఎంపీలు బాగా వంట పట్టించుకున్నారు.
బిజేపీ అగ్ర నాయకత్వం తమ పార్టీ 2014 ఎన్నికల ఎంపీ అభ్యర్ధులను సరియైన వారిని ఎంపిక చేస్తుందనే ఆశను ప్రజలు పెట్టుకోకూడదు. బిజేపీ అగ్రనేతలు ఈవిషయంలో తేలు కుట్టిన దొంగల్లాగా ఉంటారు.
ఈమాత్రం దానికి ప్రజలచేత ఉరుకులు పరుగులు పెట్టించటం ఎందుకు? ప్రజలు పరుగెత్తితే , సొమ్మసిల్లిపోయి, ఎంపీ అభ్యర్ధుల లంచగొండి స్వభావాలను, నేరపూరిత స్వభావాలను, ప్రశ్నించటం మర్చి పోతారనా?
సర్దార్ పటేల్ గుజరాత్ కు మాత్రమే చెందిన నేత కాదు. అఖండ భారత ఉపఖండానికి చెందిన నేత. హిందూ మతానికి మాత్రమే చెందిన వాడు కాదు. మతాతీతంగా, కులాతీతంగా, భారత ప్రజలందరియొక్క గౌరవానికీ అర్హుడైన వ్యక్తి. నరేంద్రమోడీకి పటేల్ కు ఎటువంటి సంబంధం ఉంటుందో, తరుణ్ గోగోయ్ కి సర్దార్ పటేల్ కు కూడా అట్టి సంబంధమే ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి , సర్దార్ పటేల్ కు కూడా అట్టి సంబంధమే ఉంటుంది. ఓమర్ అబ్దుల్లా, సర్దార్ పటేల్ కు కూడా అట్టి సంబంధమే ఉంటుంది.
శిఖండిని ముందు బెట్టుకొని అర్జునుడు భీష్ముడిని కొట్టినట్లుగా , నెహ్రూకుటుంబాన్ని ముందు పెట్టుకొని, వారితో కలసి, కాంగ్రెస్ నేతలు దేశాన్ని కొల్లగొట్టుతూ ఉంటే, దానికి విరుగుడు, నరేంద్రమోడీ సర్దార్ పటేల్ ను , స్వామీ వివేకానందాలను ముందు పెట్టుకోటం కాదు. రెండు తప్పులు ఎన్నటికీ ఒక రైట్ అవవు.
పరుగు తీయమని సగటు భారతీయులకు మోడీ గారు చెప్పవలసిన పని లేదు. లేచిందగ్గరనుండి, సగటు భారతీయులు చేసే పనే అది. నాకు తెలిసిన ఒక గ్రామీణ యువకుడు ఉన్నాడు. అతడిది గుంటూరుకి 30 కిలోమీటర్ల దూరం లోని ఒక గ్రామం. తెల్లవారు ఝామను మూడు గంటలకి అతడు నిద్రలేస్తాడు. కాలకృత్యాలు తీర్చుకొని గ్రామంలో ఇళ్ళచుట్టూ తిరిగి పాలను పోగు చేస్తాడు. వాటిని ఒక క్యాన్ లో నింపుకొని , సైకిల్ పై పొరుగు గ్రామంలొ ఉన్న రైలుస్టేషన్ కు చేరుకొని స్టాండులో సైకిల్ ను పెట్తాడు. రైల్లో గుంటూరు వచ్చి గుంటూరు స్టేషన్ స్టాండులో పెట్టిన మరొక సైకిల్ ను తీసుకుని, గుంటూరులో ఇంటింటికి తిరిగి ఖాతాలకు పాలు పోస్తాడు. మధ్యాహ్నం కల్లా ఈపని ఎట్టి పరిస్థితుల్లోను ఈపని పూర్తి కావాలి. లేకపోతే ట్రెయిన్ మిస్ అవుతుంది. అందుకే పరుగులు తీయటం.
సైకిల్ ఎక్కానాం దిగానాం అన్నట్లుగా ఉరికి ఉరికి అతడు రైలు టైముకి స్టేషన్ కి చేరుకుంటాడు. సైకిల్ ని స్టాండులో పెట్తాడు. ప్లాట్ ఫారమ్ పైకి ఉరికి వంతెనలను, పట్టాలనూ దూకుతూ, తన రైలును పట్టుకుంటాడు. తన స్టేషన్ రాగానే దిగి, స్టాండులో ఉన్న మొదటి సైకిల్ ను తీసుకొని తన గ్రామానికి చేరుకుంటాడు.
ఇవి గుంటూరులోనే కాదు, భారతదేశమంతా జరిగే రోజు వారీ పరుగు పందాలే. ఇలా చేసినందుకు పౌరులెవ్వరూ రొమ్ములు విరుచుకోరు. తాము గొప్పదేశ భక్తులమని, మిగతా వాళ్ళంతా దేశద్రోహులని డబ్బా కొట్టుకోరు.
ఇప్పుడు బిజేపీ అఖిలభారత అధ్యక్షుడిగా పనిచేసిన ఒక కోస్తాంధ్ర నేతను తీసుకోండి. ఆయన జెడ్ కేటగిరి భద్రత లేనిది కదలలేడు. కారు అద్దాలకు నల్ల ఫిలిం అంటించుకోక పోతే ఏమవుతుందో నని భయం. ఆంధ్ర ప్రదేశ్ ను విభజించమని వెంట పడుతున్న వారిలో ఈమహనీయుడు కూడ ముందంజలో ఉన్నాడు. ఆవిభజన ఘోరమైన అన్యాయంతో నిండి ఉన్నా సరే పల్లెత్తు మాట అనడు. అంటే రాజ్యసభ సభ్యత్వం పోతుందేమో, లేక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లేక దక్షిణ భారత్ బిజేపీ కోటాలో రావలసిన మంత్రి పదవో, గవర్నర్ పదవో రాదేమో నన్న భయం కావచ్చు. ఇప్పుడు జెడ్ కేటగిరి భద్రతా కావలసిన వాడు నరేంద్రమోడీ. తనకు సాధారణ రాజ్యసభ సభ్యుడి భద్రత చాలని, మోడీకి జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించమనీ, బిజేపీ కేంద్రనాయకత్వం ద్వారా కేంద్ర హోంశాఖకు ప్రతిపాదించవచ్చు. కానీ ఎందుకు ప్రతి పాదించడు?
ఒక ప్రక్క సరియైన భద్రత లేక అటవీ గార్డులు స్మగ్లర్లచేత నరికి వేయబడుతున్నారు. ఇంకొక ప్రక్క హైదరాబాదులో జనం మధ్యలో బాంబు పేలుళ్ళకు ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. ప్రస్తుతం ఉన్న శాంతి ఒక ప్రేలుడికి ఇంకొక ప్రేలుడికీ మధ్య ఉన్న విశ్రాంతి మాత్రమే.
ఎక్కడి కసువు అక్కడ వదిలేసి ఎంకమ్మ ఇల్లలికినట్లు, బిజేపీ ఐక్యతా నడకలను నిర్వహించటం వల్ల ఆపార్టీ ఎన్నకల్లో గెలిచి అధికారంలోకి వస్తే రావచ్చు కానీ నిజమైన ఐక్యతరాదు. బిజేపి ఇప్పటికే మహారాష్ట్రనుచీల్చి విదర్భను ఇస్తామని ఆప్రజలను రెచ్చగొట్టటం మొదలు పెట్టింది. సోనియా రాహుల్ లు కూడా విదర్భ ప్రజలకు ఇటువంటి హామీలే ఇవ్వచ్చు. ప్రత్యేక రాష్ట్రాలను ఇవ్వటం, ఇస్తామనటం తప్పు కాదు. కానీ ఇలాంటి వాగ్దానాలను ఎన్నికల సీజన్ లోనే ఎందుకు చేయటం?
విభజన ఎజెండాను నడుపుతూ, ప్రజలను ఐక్యతా మార్చ్ లపేరు తో ఉరికిస్తే ఎలా?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.