255 శేషాంధ్ర వ్యవసాయమంత్రి వ్యవసాయాన్ని అభివృధ్ధి చేసే పధ్ధతి ఇదేనా
చర్చనీయాంశాలు-- వ్యవసాయం, రాజధాని, భూసేకరణ, అధికార వికేంద్రీకరణ, మంగళగిరి
శ్రీ ప్రత్తిపాటి పుల్లారావుగారు ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖామాత్యులు. 12.6.2014 నాటి ఈనాడు లో ప్రచురించబడిన వీరి సుభాషితమును మనం గుర్తుంచుకొని తీరవలసినదే.
రాజధానికి 20000 ఎకరాల సాగుభూమి
రాజధానికోసం రైతులనుండి దాదాపు 20 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. అప్పుడే ఒక మంచి రాజధానిని నిర్మించుకోగలం. రైతుల మనసుల్లో ఆనందం నింపటమే నాపని. ... ....
రాజధాని కోసం 20000 ఎకరాల సాగుభూమిని సేకరిస్తే ఎంత మేరకు ప్రజలకు నష్టం వాటిల్ల వచ్చు?
సేకరించే భూమి పల్లపు భూమి అయితే ఎకరానికి 30 క్వింటాల్స్ వరి పండుతుందనుకుంటే, 20 వేల ఎకరాలకు 20000 x 30 = 6,00,000 క్వింటాల్స్ లేక 6 కోట్లకిలోల వడ్లు, షుమారు 3 కోట్ల కిలోల బియ్యం ఉత్పత్తి ప్రతి సంవత్సరం ప్రజలు నష్టపోతారు.
సేకరించే భూమి ప్రత్తి లేక మిరప పండించే భూమి అయినా నష్టం ఇంతే ఉంటుంది.
ఒక లెక్క-- ఎకరానికి 8 క్వింటాల్స్ పత్తిపండుతుంది అనుకుంటే, 20 వేల ఎకరాలకు, 20000 x 8 = 1,60,000 క్వింటాల్స్ పత్తి. ఎకరా కి 6 క్వింటాల్సే పండే నాసి రకం భూమి అనుకున్నా, 20000 x 6 = 1,20,000 క్వింటాళ్ళ ప్రత్తి, ప్రతి ఏటా నష్టపోతాము.
20000 వేల ఎకరాల సాగు భూమిని సేకరించమని ఈయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సలహా ఇచ్చి ఉంటే, ఈ పుల్లారావు గారు అభ్యంతరం పెట్టి ఉండవలసినది. అపుడే ఆయన వ్యవసాయ మంత్రిగా తన విధిని సరిగా నిర్వహించినట్లయ్యేది.
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అసలు అధిక పరిమాణంలో భూమి ఎందుకో అర్ధం కావటం లేదు. నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంతంలో క్వారీ భూములు, కంప పెరిగిన బీడు భూములు, భారీగా ప్రభుత్వానికి ఉన్నాయి. ఒకవేళ మంగళగిరి , నాగార్జున యూనివర్సిటి ప్రాంతాలు రాజధానిగా అన్నిటికన్నా గొప్పవి అని మాటవరసకు అనుకున్నా, 20 అంతస్తుల భవనాలను నిర్మించుకుంటే, పది ఎకరాలలోనే సచివాలయాన్ని, శాసన సభ, శాసన మండలి భవనాలను, శాసన సభ్యులకు, మంత్రులకు క్వార్టర్లను కూడ నిర్మించు కోవచ్చు.
రాష్ట్రస్థాయి డైరక్టరేట్లకు నేను పోస్టు నంబర్ 252 లో సూచించిన విధంగా, click to go to 252
మూతబడనున్న ఇంజనీరింగు, ప్రైవేటు డిగ్రీ కాలేజీల భవనాలను టెండర్లద్వారా కొనుగోలు చేసి, వాటిని వాడుకోవచ్చు.
ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర స్థాయి కార్యాలయం వచ్చి, జిల్లాల వారందరికీ, మారు మూల ఉన్నవారితో సహా, తాము రాష్ట్ర పాలనలో భాగం పంచుకుంటున్నామన్న భావం కలుగుతుంది. అధికార వికేంద్రీకరణ అంటే ఇదే.
ఈయన మేకపిల్లను భుజం మీద పెట్టుకున్నాడు కాబట్టి, ఈ వెన్నుపోటు సార్వభౌముడికి మేకపిల్లపై ప్రేమ కారిపోతుందని మనం భావించకూడదు. ఆమేక బాగా కండ, మాంసం పట్టగానే, దానిని కసాయి వాడికి అమ్మేయక తప్పదు. ఇది పెట్టుబడిదారీ రీతి. మేక మాంసం తినటానికి పనికిరాకపోతే మేకలను ఎవరూ పెంచరు.
తెలంగాణను బుజ్జగించే పని, కెసిఆర్ ను అదుపులో పెట్టేపని శ్రీ వెంకయ్యనాయుడు , కేంద్ర హోం మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగుకు వదిలేస్తే బాగుంటుంది. కారణం: శ్రీ వెంకయ్యనాయుడుని తెలంగాణ ప్రజలు, నేతలు, సీమాంధ్ర నేతగా పరిగణిస్తున్నారు. కనుక శ్రీ వెంకయ్య సత్యం చెప్పినా, అసత్యం చెప్పినా, తెలంగాణలో నిరసనలు రేగే అవకాశం ఉంది.

నాయుడు ద్వయం (శ్రీవెంకయ్యనాయుడు, శ్రీ చంద్రబాబు నాయుడు), వీళ్ళకి విగుంతె మంగళగిరి ప్రాంతంలో ఏమైనా బినామీ భూములు ఉన్నాయో ఏమో మనకు తెలియదు కానీ, విగుంతె ప్రాంతంలో పేట్రేగిన భూముల స్పెక్యులేషన్ లో అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. విశాఖ నుండి తిరుపతి వరకు జరుగుతున్న ఇళ్ళ స్థలాల స్పెక్యులేషన్లో సీమాంధ్ర భూకులాలు రెండు మూడే ముందంజలో ఉండటం గమనార్హం. మిగిలిన కులాల వారు సేల్స్ ఉద్యోగులుగానో, బ్రోకర్లుగానో నాలుగు రాళ్ళకోసం ఆశ పడుతున్నారు తప్ప వందలాది ఎకరాలు కొనే స్థితిలో లేరు. నాయుడు ద్వయం వారి సామాజిక వర్గం వారు ఈవిషయంలో అతి ముందంజలో ఉండటం గమనార్హం. వారు చేసే ప్రకటనలు పేదతరగతుల వారికి వంద గజాల స్థలాలకు కూడ నోచుకోకుండా చేస్తాయి.
సీమాంధ్రను మూడు రాష్ట్రాలు చేయాలనే నా అభిప్రాయంలో మార్పులేదు. అపుడే మూడు రాజధానులు వస్తాయి. స్పెక్యులేషన్ వికేంద్రీకరణ జరుగుతుంది. రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఇపుడు ఎవరు బాగు పడుతున్నారు? టోల్ గేట్ల వాళ్ళు , ప్రైవేటు బస్సుల వాళ్ళు.

చిత్రం వెలుగునీడలు.